ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు జరుపుతున్న సోదాల్లో పలుచోట్ల భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది.తాజాగా అలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పేరకలపాడు గ్రామ శివార్లలో జరిపిన తనిఖీల్లో ఈ బంగారాన్ని గుర్తించారు.


తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ లాజిస్టిక్ వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపి, సోదా చేసింది. ఈ సోదాల్లో భారీగా బంగారం, వెండి అభరణాలను గుర్తించారు. విజయవాడలోని నగల దుకాణాలకు వీటిని తరలిస్తున్నట్లు సమాచారం. అయితే తరలిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అన్ని బిల్లులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులను అన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత.. వాహనాన్ని రిలీజ్ చేశారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిసింది.


మరోవైపు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద కూడా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా.. ఓ మహిళ బ్యాగులో 50 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లవద్దని అధికారులు చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వచ్చినప్పటికీ.. సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com