టీమ్ఇండియా బౌలింగ్ దాడికి ఇషాంత్ శర్మ సరికొత్త వైవిధ్యం తీసుకొస్తాడని న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అన్నాడు. టెస్టు సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడిని కట్టడి చేయడంపైనే దృష్టిపెడితే ఇబ్బందుల్లో పడుతామని వెల్లడించాడు. అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచులు ఆడిన ఒకే ఒక్కడిగా నిలిచేందుకు టేలర్ రెండు రోజుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 231 వన్డేలు, 100 టీ20లు, 99 టెస్టులు ఆడాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న లంబూ తిరిగి జట్టులో చేరాడు. ‘కేవలం బుమ్రాపైనే దృష్టిపెడితే మేం చిక్కులు ఎదుర్కోవాల్సివుంటుంది. టీమ్ఇండియా బౌలింగ్ దాడి భీకరంగా ఉంటుంది. ఇషాంత్ శర్మ రావడంతో ఆ దాడికి మరింత వైవిధ్యం చేకూరింది. భారత్లో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మేం వారిని నియంత్రించాలి. కానీ వారిది ప్రపంచ నంబర్వన్ జట్టు. కోహ్లీసేనను అడ్డుకోవాలంటే మేం విజయవంతంగా మా ఆటను ఆడాలి’ అని రాస్ టేలర్ అన్నాడు. అరుదైన ఘనత సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో టేలర్ తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ‘వైఫల్యాలు, ఫామ్లేమి నన్నో వ్యక్తిగా, ఆటగాడిగా తీర్చిదిద్దాయి. బాగా ఆడుతున్నప్పుడు పరుగులు చేయడమే కాదు వైఫల్యాలను నియంత్రించే తీరు, సాధన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలూ ఫామ్ను తిరిగి తీసుకొస్తాయి. వందో టెస్టు సందర్భంగా డేనియల్ వెటోరీ, బ్రెండన్ మెక్కలమ్ నాకు సందేశాలు పంపించారు. బాగా ఆడాలని కోరుకున్నారు. 2019 ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు గురించి ఆలోచించా. కానీ నేనింకా ఆడగలనని అనిపించింది’ అని టేలర్ తెలిపాడు.