అడ్డగోలుగా, హేతు రహితంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు విమర్శించారు. నాడు విభజనను తెలుగుదేశం వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అయితే హేతుబద్ధంగా ఇరు ప్రాంతాల వారికీ సమన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరగాలని చెప్పామని అన్నారు. అయితే కాంగ్రెస్ చేసిన పని వల్ల ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు రావలసిన పరిస్థితిని ఎదుర్కొందన్నారు. అదే సమయంలో కుంభకోణాలతో దేశ భవిష్యత్ డోలాయమానంలో పడిందన్నారు. ఇంతటి అనర్ధాలకు కారణమైన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోనికి వస్తే దేశ భవిష్యత్ ఏమౌతుందోనన్న భయం కలిగిందన్నారు. దేశ భవిష్యత్ ను, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను నాడు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అమెరికాలో కాలినడకన ఫైళ్లు పట్టుకు తిరిగానని నారా చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు. నాడు తన కృషి ఫలితంగానే హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమ తరలి వచ్చిందన్నారు. ఇప్పడు దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ కు ఆదాయం వస్తున్నదంటే అందుకు నాడు నేను వేసిన పునాదే కారణమని చంద్రబాబు చెప్పారు.