ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా నేనా !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2017, 12:01 AM

 -అన్ని స్థానాల్లో పాగాకు టీడీపీ వ్యూహ రచన 


 -ఏపీలో ఊపందుకున్న నేతల ప్రచారాలు


 -సిట్టింగ్‌ స్థానాల్ని కాపాడుకునేందుకు పీడీఎఫ్‌ పోటీ 


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : శాసనమండలి ఎన్నికలకు మరో మూడు వారాల్లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మూడు పట్టభద్ర, రెండు ఉపాధ్యాయ స్థానాల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తుండగా, సిట్టింగ్‌ స్థానాలను కాపాడుకునేందుకు పీడీఎఫ్‌ అదే స్థాయిలో పోటీ పడుతోంది. మరోపక్క వెకాపా ఒక పట్టభద్రుల నియోజకవర్గంలో అభ్యర్థికి అధికారికంగా మద్దతిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తప్ప మిగతా నాలుగు చోట్లా సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు మళ్లీ బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర స్థానాన్ని మిత్రపక్షం భాజపాకి తెదేపా కేటాయించింది. నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి చిత్తూరు జిల్లాకు చెందిన మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు బలపరచిన వాసుదేవనాయుడు పేరును గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఐదు స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం వరకు ఐదు స్థానాల్లో 27 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తరాంధ్ర స్థానానికి అత్యధికంగా 11 నామినేషన్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి పీడీఎఫ్‌ బలపరుస్తున్న అభ్యర్థిగా అజేశర్మ పోటీ చేస్తున్నారు. పి.వి.ఎన్‌.మాధవ్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్‌ తరపున యడ్ల ఆదిరాజు పోటీ చేస్తున్నారు. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు పట్టభద్రుల స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పీడీఎఫ్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ పీడీఎఫ్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. ఏపీటీఎఫ్‌ నుంచి సూరినేని ఆనంద్‌నాయుడు పోటీలో ఉన్నారు. కర్నూలు, కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా కె.జె.రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌కు వామపక్షాలు మద్దతిస్తున్నాయి. వైకాపా మద్దతుతో వెన్నపూస గోపాల్‌రెడ్డి పోటీచేస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పోటీ చేస్తున్నారు. కె.వి.సుబ్బారెడ్డి, కత్తి నరసింహారెడ్డి (ఎస్టీయూ), ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులంతా ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్‌‌సలో మాట్లాడారు. వీరిలో మంత్రులు పి.నారాయణ, శిద్ధా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com