మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదలైంది. ఆమెకు నెల రోజుల పెరోల్ మంజూరవడంతో కొద్దిసేపటి క్రితం వేలూరు జైలు నుంచి విడుదల చేశారు. కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం 6 నెలలపాటు పెరోల్ కావాలని నళిని కోర్టును ఆశ్రయించగా.. నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది. ఈ నెల రోజులపాటు ఆమె వేలూరు రంగాపురంలోని పులవార్ నగర్లో ఉన్న ద్రవిడ ఉద్యమ తమిళ సమాఖ్య రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగరాయర్ ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది. 27ఏళ్లుగా నళిని వేలూరులోని మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తోంది. ఆమె భర్త మురుగన్ వేలూరు పురుషుల జైల్లో ఉన్నాడు.