ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ ఈరోజు లోటస్ పాండ్లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయన టీడీపీలో చేరతారని, లేదు, పవన్ పార్టీ జనసేనలో కలుస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు, పవన్తో విడివిడిగా భేటీ కావడంతో దీనికి బలం చేకూరించింది. అయితే ఆయన ఈ అంచనాలను తారుమారు చేస్తూ వైకాపాలో చేరిపోయారు. ఎందుకిలా చేశారనేదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
అలీ రాజమండ్రి నుంచి టీడీపీ టికెట్ ఆశించారని, అయితే పచ్చపార్టీ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆయన ఏకంగా మంత్రి పదవిని కూడా ఆశించారని, మంత్రిని చేస్తానని హామీ ఇవ్వాలని కోరగా, చంద్రబాబుకు అందుకు ఒప్పుకోలేదని చెబుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ.. అలీకి టికెట్ ఇస్తే ఓడిపోతారని తమ సర్వేలో తేలిందని, అందుకే నిరాకరించామని చెప్పారు.
అయితే తాను ప్రచారం మాత్రమే చేస్తానని, పదవి ఆశించడం లేదని అలీ చెబుతున్నారు. కానీ వైకాపా నుంచి టికెట్ విషయంలో గట్టి హామీ రావడంతోనే ఆయన తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీకి, జనసేనకు గెలిచే అవకాశాల్లేవని అలీ అంచనా వేసుకున్నారని, అందుకే వైకాపాలో చేరానని ఆయన సన్నిహితులు అంటున్నారు. తాము కేంద్రంలోని బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైకాపానే అలీకి టికెట్ ప్రతిపాదన పంపి చేర్చుకుందనీ చెబుతున్నారు.