న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన వివాదాస్పద శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్పై ఎయిర్లైన్స్ అసోసియేషన్ నిషేధం విధించింది. ఆయన ఏ విమానంలోనూ ఎక్కకుండా బహిష్కరించింది. అతన్ని 25 సార్లు చెప్పుతో కొట్టానని తానే చెప్పుకున్న గైక్వాడ్.. క్షమాపణ చెప్పడానికి మాత్రం అంగీకరించలేదు. ముందు ఆ ఉద్యోగినే చెప్పమనండి.. తర్వాత చూద్దామంటూ గైక్వాడ్ అనడం గమనార్హం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు గైక్వాడ్. తనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వలేదన్న కారణంగా గురువారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగిపై ఆయన చెప్పుతో దాడి చేయడం వివాదాస్పదమైంది. అయితే ఆ విమానమంతా ఎకానమీ క్లాస్ మాత్రమే ఉండటంతో ఆయనను వీఐపీగా భావించి ముందు సీట్లో కూర్చోబెట్టారు. అయినా గైక్వాడ్ మాత్రం దురుసుగా ప్రవర్తించి ఉద్యోగిపై దాడిచేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆయన కిందికి దిగడానికి నిరాకరిస్తూ నిరసన తెలిపారు. అది సరికాదని మేనేజర్ శివకుమార్ నచ్చజెప్పడానికి ప్రయత్నించడంతో గైక్వాడ్ దాడికి పాల్పడ్డారు. అటు శివసేన పార్టీ కూడా తమ ఎంపీ తీరును తప్పుబట్టింది.