ముంబయి: భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు. అవినీతిని అరికట్టడానికి మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చేపడుతున్న డిజిటల్ డ్రైవ్స్ తదితర చర్యలను అంబానీ అభినందించారు. ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం పట్ల ధన్యవాదాలు. నగదు వినియోగం నుంచి డిజిటల్ ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ పెద్ద అడుగు ముందుకేసింది. దీని వల్ల ఉత్పాదకతలో లేని నగదు కూడా ఉత్పాదకతకు ఉపయోగపడే నగదుగా మారుతుంది’ అని అంబానీ ఓ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. రానున్న రోజుల్లో కేవలం ఆధార్ కార్డు గుర్తింపుతో మొబైల్ ద్వారా నిమిషాల్లో బ్యాంకు నుంచి రుణం కూడా పొందే అవకాశం రావొచ్చని అభిప్రాయపడ్డారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాధారణ ప్రజలపై కొద్దిమేర ప్రభావం చూపిందని అన్న అంబానీ ‘గ్రామీణ ప్రజల గురించి అర్థం చేసుకున్నట్లే ప్రపంచం, సాంకేతికత గురించి కూడా అర్థం చేసుకొని ముందుకు నడిపించే నేత దొరకడం మన అదృష్టం. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు (మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో) అక్కడ భోజన సమయంలో కూడా టెక్నాలజీ పేద ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది, వారి అభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుంది.. అనే అంశంపైనే మాట్లాడడం నన్ను చాలా ఆకట్టుకుంది’ అని అంబానీ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.