రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట హార్టీ కల్చర్ కళాశాల వద్ద గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఓబులవారిపల్లె మండలం పాత మంగపేటకు చెందిన మొగిలి వంశీకృష్ణ (20), నెల్లేపల్లి శ్రీకాంత్ (22) అనే ఇద్దరు యువకులు మోటారుబైక్పై వెళుతూ.. నిలబడి ఉన్న ఖాళీ సిమెంట్ లారీని ఢీకొన్నారు. లారీ వెనుకభాగాన్ని ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన సిమెంటు లారీని సంఘటన స్థలం నుంచి తొలగించి పరారయ్యాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు చెక్ పోస్టులలో అప్రమత్తం చేసి పుత్తనవారిపల్లె వద్ద లారీని, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై భక్తవత్సలం తెలిపారు. లారీ డ్రైవర్ సూర్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భక్తవత్సలం తెలిపారు.