వారణాసి : ఉత్తరప్రదేశ్లో ఆఖరి విడుత ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో వారణాసిలో ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోదీకి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. వారణాసి వీథులన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. బుధవారం యూపీ ఆఖరి విడత పోలింగ్ జరగనుంది. గంగానది తీరంలో ఉన్న గద్వాగాట్ ఆశ్రమాన్ని మోదీ సందర్శించారు. వారణాసి విమానాశ్రయం నుంచి నేరుగా ఆశ్రమానికి చేరుకున్నారు. దారి పొడవునా బీజేపీ జెండాలతో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆశ్రమానికి చేరుకున్న మోదీకి రుద్రాక్ష మాలలు వేసి నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న గోవులకు మోదీ స్వయంగా గ్రాసం వేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆశ్రమ ప్రముఖులతో ముచ్చటించారు. మోదీ ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.