న్యూదిల్లీ: గత కొద్ది రోజులుగా బంగారం ధర పడుతూ, లేస్తూ ఉంది. తాజాగా సోమవారం నాటి ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,750కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం బంగారం ధర తగ్గుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోపక్క వెండి ధర సైతం రూ.300 తగ్గి కిలో వెండి రూ.42,800లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.19శాతం తగ్గి ఔన్సు 1,231.90 డాలర్లకు చేరింది. వెండి ధర 0.92శాతం తగ్గి ఔన్సు 17.18 డాలర్లగా ట్రేడ్ అయింది.