కోల్కతా : పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైననాటినుంచి పోలింగ్ పూర్తయ్యే వరకూ పలు చోట్ల హింసాకాండ చెలరేగడంతో ఓట్ల లెక్కింపును భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఏ పార్టీ కూడా విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 58692 సీట్లలో 34 శాతం సీట్లలో టిఎంసి పార్టీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. మిగిలిన 38529 సీట్ల కోసం 1.5 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.