జాతీయ రహదారి విస్తరణలో 452 మంది రైతులకు రూ 4. 50 కోట్ల పరిహారం వారి ఖాతాలకు జయ చేశామని ఎంపీపీ పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం అందించామన్నారు. ఇంకా 92 మంది రైతుల భూ తగాదాలు ఉన్న కారణంగా పరిహారాన్ని కోర్టుకు అప్పగించి చెల్లిస్తారన్నారు.
ఈ నెల 27, 28 తేదీల్లో నేషనల్ ల్యాండ్ ఆక్విజిషన్లో భాగంగా రొంపిచెర్ల మండలంలోని బండకిందపల్లె, పెద్దగొట్టిగల్లు, బొమ్మయ్యగారిపల్లె పంచాయతీలో సేకరించిన భూములు హైవే శాఖకు అప్పగిస్తామని తహసీల్దార్ మురాషావళి తెలిపారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన బొమ్మయ్యగారిపల్లెకు చెందిన కె. సదా శివారెడ్డి మాట్లాడుతూ తన 1. 20 ఎకరాలను రోడ్డు విస్తరణకు ఇచ్చానని, బహిరంగ మార్కెట్లో ఎకరం విలువ రూ 1. 50 కోట్లు చేస్తుంటే ప్రభుత్వం రూ. 15 లక్షలు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.