పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారన్నారు. గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారని, గ్రేడింగ్ పద్ధతిని తీసేశారన్నారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదని, ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదన్నారు. అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.