ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రపంచ మతిమరుపు దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 01:18 PM

జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు.. అన్నాడో సినీకవి. అలాంటి జ్ఞాపకాలే జీవితాన్ని నిత్యనూతనం చేస్తుంటాయి. జ్ఞాపకాలు లేకపోతే మనసంతా శూన్యమై, బతుకు భారమైపోతుంది. కొన్ని జ్ఞాపకాలు మెదడు పొరల్లో నిక్షిప్తమై ఎన్ని ఆటుపోటులు ఎదురైనా తీపిగుర్తుగా నిలిచి పోతాయి. ఆశాభావాన్ని మేల్కొలుపుతాయి. అలాంటి జ్ఞాపకాలకు మూలమైన జ్ఞాపకశక్తిని కొల్పోతే ఆ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇలా జ్ఞాపకశక్తిని కోల్పోవటమే వైద్య పరిభాషలో అల్జీమర్స్‌ (మతిమరుపు) అంటారు.


జ్ఞాపకశక్తి క్రమేపి తగ్గిపోయి (డెమెన్షియా) బంధువులు, స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులనూ మరిచిపోయే స్థాయికి చేరుకోవడమే ఈ వ్యాధి. దీనిని నిర్లక్ష్యం చేస్తే వ్యాధిగ్రస్తులు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది. 60 ఏళ్ల వయస్సు నుంచే ఈ మతిమరుపు వ్యాధి ప్రారంభమై 80 ఏళ్లకు తీవ్ర దశకు చేరుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి కారణంగా కొంత మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు. 1906వ సంవత్సరంలో అల్జీమర్‌ అనే జర్మనీ న్యూరో పైఽథాలజిస్ట్‌ ఈ వ్యాధిని కనుగొన్నాడు. మెదడులోని కొన్ని భాగాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఆయన గుర్తించారు. ఆయన జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబరు 21వ తేదీన ప్రపంచ ఆల్జీమర్స్‌ డేగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.


విశాఖ జిల్లాలో అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులు 70 వేల మందికిపైగా ఉన్నారు. 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సులో ఉన్న వారిలో 10 శాతం మంది, 85 ఏళ్ల పైబడినవారిలో 50 శాతం మంది ఈ వ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారే వ్యాధికి గురవుతున్నారు. దేశంలోనే 3.7 మిలియన్ల వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.


మానసిక ఒత్తిడికి, అల్జీమర్స్‌కు అవినాభావ సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి లోనైనప్పుడు మెదడులోని విషయ గ్రహణ చర్యను అడ్డుకునే అల్లోప్రెగనోలోన్‌ అనే స్టెరాయిడ్‌ స్థాయి పెరుగుతుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్జీమర్స్‌ వచ్చే ముప్పు ఉంటుంది. అల్జీమర్స్‌తో మెదడు కణాలు దెబ్బతింటాయి. అందుకని ఒత్తిడిని అధిగమించడం, మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com