ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో ఈడీ సోదాలు.. గుట్టలకొద్దీ నోట్ల కట్టలు

national |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 09:59 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలుచోట్ల సోమవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. లెక్కల్లో చూపని రూ.25 కోట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. మంత్రి అనుచరుడు నివాసంలో గుట్టల కొద్దీ కరెన్సీ నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. మనీల్యాండరింగ్ ఆరోపణలపై గతేడాది ఫిబ్రవరిలో అరెస్టైన ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి విభాగం మాజీ చీఫ్ ఇంజినీర్‌ వీరేంద్ర రామ్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజాగా, ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేపట్టింది.


ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడి నివాసంలో కరెన్సీ నోట్ల గుట్టలుగా ఉన్న వీడియో ఫుటేజ్ వైరల్ అవుతోంది. రాంచీలోని సెయిల్ సిటీ సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం సెయిల్ సిటీలో రహదారుల నిర్మాణ శాఖ ఇంజినీర్ వికాస్ కుమార్ నివాసంలో ఓ బృందం... బరియాతు, మొర్హబడి, బొడియాలో వేర్వేరు బృందాలు సోదాలు నిర్వహించాయి.


కాంగ్రెస్ నేత అయిన అలంగీర్ ఆలం.. పకూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంపెయి సోరెన్ క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి నివాసంలోనే నోట్ల కట్టలు దొరకడంతో బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఝార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ మాట్లాడుతూ.. ‘ఝార్ఖండ్‌లో అవినీతికి అడ్డుకట్టవేయడం లేదు...ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ డ‌బ్బును ఖర్చుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.


ఝార్ఖండ్ రాజకీయ నేతల లావాదేవీలు వివరాలున్నట్టు అనుమానిస్తున్న పెన్ డ్రైవ్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. కాగా, ఈడీ సోదాలపై ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నిషికాంత్ దుబే స్పందిస్తూ.. ‘ఝార్ఖండ్ ప్రభుత్వ అవినీతి చక్రవర్తి మంత్రి ఆలంగీర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో లభ్యమైన నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది.. రూ.30 కోట్లకుపైనే ఉంటుంది.. లాల్‌పై ఈడీ చర్యలు తీసుకుంది.. ’ అని ట్వీట్ చేశారు.


ఇప్పటికే మనీల్యాండరింగ్ ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను ఇటీవల కోర్టు తిరస్కరించింది. అయితే, కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, నాయకులనే ఈడీ, సీబీఐలు టార్గెట్ చేస్తున్నాయని, ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయ కక్షసాధింపు చర్యలేనని దుమ్మెత్తిపోస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com