ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగటి కలలు కనొద్దు.. ‘జూన్ 4 గడువు’ వ్యాఖ్యలపై మోదీకి సీఎం కౌంటర్

national |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 09:11 PM

ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి బిజు జనతాదళ్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదల సంఖ్య పెరగడానికి బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు బాధ్యులని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు కాంగ్రెస్, 25 ఏళ్లు బీజేడీ పాలించాయని.. పేదరికంపై ఆ రెండు పార్టీలూ ఏం సమాధానం చెబుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా. ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ ప్రభుత్వానికి జూన్ 4తో గడువు ముగుస్తుందని, జూన్ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. అంతేకాదు, మీ అందరినీ ఇవాళే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా అని గంజాంలో జరిగిన ఎన్నికల సభకు హాజరైనవారిని ఉద్దేశించి మోదీ అన్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. యూపీయే హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పదేళ్ల పాటు రిమోట్ సోనియా గాంధీ చేతిలో ఉండేదని విమర్శించారు. ‘మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు ఒడిశాకు కేవలం రూ.లక్షలు కోట్లు ఇస్తే.. తాము గత పదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చాం.. మహిళల సంక్షేమం అంటే ఒడిశా ప్రభుత్వానికి పట్టదు... గర్భిణిలకు రూ.6 వేలు సాయం చేసే ముఖ్యమైన కేంద్ర పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దుచేసింది.. జలజీవన్ మిషన్ కోసం రూ.10 వేలు కోట్లు ఇస్తే వాటిని ఖర్చుచేయలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం కోసం మోదీ డబ్బు పంపితే దారుణంగా రహదారులు తయారుచేసింది.. మోదీ ఉచిత రేషన్ పంపితే బీజేడీ ప్రభుత్వం తన ఫోటోలను వేసుకుంటోంది’ అని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై బీజేపీ దీటుగా స్పందించింది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ వాదనలపై ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియోను నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడు వీకే పాండియన్ షేర్ చేశారు. ‘బీజేపీ పగటి కలలు కంటోంది’ అని నవీన్ పట్నాయక్ కౌంట్ ఇచ్చారు. అయితే, ఒడిశాలో బీజేడీ, బీజేపీల మధ్య స్నేహపూర్వక పోటీ నడుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ అగ్రనేతలు ఎవరూ నవీన్ పట్నాయక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పార్లమెంట్‌లో మోదీ సర్కారు కీలక నిర్ణయాలు, బిల్లులకు మద్దతుగా నిలిచింది. నవీన్ పట్నాయక్‌, మోదీలు ఒకరిపై ఒకరు ప్రసంశలు, అభినందనలు కురిపించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకూ ఒడిశాలో బీజేడీ-బీజేపీ కూటమి కలిసి ముందుకెళ్తుందనే ప్రచారం జరిగింది. దాదాపు ఇరు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చిందని, బీజేడీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలు.. బీజేపీ మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com