ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలోమీటరున్నర బ్రిడ్జి నిర్మాణానికి రూ.91 వేల కోట్ల ఖర్చు.. 9 ఏళ్లపాటు నిర్మాణం

international |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:19 PM

రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తప్పించేందుకు ప్రభుత్వాలు ఎన్నో బ్రిడ్జిలు నిర్మిస్తూ ఉంటాయి. రైళ్లు కూడా ప్రయాణించేందుకు రోడ్డుపైన రైల్వే బ్రిడ్జిలు కడుతూ ఉంటారు. అయితే ఓ కిలోమీటరున్న పొడవు ఉండే బ్రిడ్జిని నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టింది. ఎంతలా అంటే ఏకంగా రూ.91 వేల కోట్ల ఖర్చు చేసింది. ఇక ఈ చిన్న బ్రిడ్జిని నిర్మించేందుకు ఏకంగా 9 ఏళ్ల సమయం పట్టింది. దీంతో ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.91 వేల కోట్లు ఉంటే ఓ చిన్న రాష్ట్రానికి అయ్యే ఏడాది బడ్జెట్‌కు సమానం. అయితే ఈ బ్రిడ్జి మాత్రం మన దేశంలో కాదు అమెరికాలో. ఇక ఈ విషయాన్ని కాలిఫోర్నియా హైస్పీడ్‌ రైల్‌ సంస్థ ట్వీట్‌ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మొదలు ఎంతో మంది అమెరికన్ బిజినెస్‌మెన్‌లు కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 11 బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.91 వేల కోట్లు ఖర్చు చేసి 9 ఏళ్ల పాటు నిర్మించింది. అంతేకాకుండా అంత ఖర్చు చేసి.. అన్ని ఏళ్లపాటు నిర్మించి.. చివరికి పూర్తయిన తర్వాత గ్రాండ్‌గా సెలబ్రేట్ కూడా చేసుకుంది. ఈ క్రమంలోనే ఫ్రెస్నో రివర్‌ వయాడెక్ట్‌ను గతేడాది పూర్తి చేశామని.. కాలిఫోర్నియా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇది ఒక చిన్న భాగం మాత్రమేనని కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్ సంస్థ ట్వీట్ చేసింది. శాన్‌ ఫ్రాన్సిస్కో - లాస్‌ ఏంజెల్స్‌లను కనెక్ట్‌ చేసే మార్గంలో ఈ రైల్వే బ్రిడ్జి కలుపుతోంది.


  దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌.. ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరం అంటూ ఏడుస్తున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇక మరోవైపు.. ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ 1600 మీటర్ల పొడవు ఉన్న హైస్పీడ్‌ రైలు బ్రిడ్జిని 9 ఏళ్లలో రూ.91 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించారని.. ఆ బ్రిడ్జిని నడుచుకుంటూ దాటడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని.. డాజీకాయిన్‌ ఫౌండర్ బిల్లి మార్కస్‌ విమర్శలు గుప్పించారు. ఇక ఆ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు మొత్తానికి 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందన్న వార్తలపైనా బిల్లి మార్కస్ వెటకారంగా స్పందించారు. ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ పాట్రిక్‌ బ్లూమెంథల్‌ స్పందిస్తూ.. 1600 మీటర్ల ప్రాజెక్టు కోసం 15 ఏళ్లలో 11.2 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తే.. ప్రాజెక్టులోని ప్రతీ మైలుకు 36.96 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com