ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల జైలు, రూ.6 లక్షల జరిమానా

national |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:00 PM

ఎటువంటి తప్పుచేయకపోయినా.. తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన కేసుతో నాలుగేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించాడు ఓ యువకుడు. చివరకు నిజం బయటపడటంతో చెరసాల నుంచి విడుదలయ్యాడు. అయితే, తప్పుడు కేసు పెట్టినందుకు ఆ మహిళకు న్యాయస్థానం సరైన గుణపాఠం చెప్పింది. ఆ యువకుడు ఎన్ని రోజులైతే జైల్లో ఉన్నాడో.. ఆమె కూడా అన్ని రోజులు జైల్లో ఉండాలని తీర్పు చెప్పింది. అంతేకాదు, మున్ముందు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా దాదాపు రూ. 6 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తం చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.


  వివరాల్లోకి వెళ్తే.. బరాదరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ.. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ 2019 డిసెంబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15ఏళ్ల కూతురిని అజయ్‌ అలియాస్‌ రాఘవ్‌ అనే యువకుడు ఢిల్లీ తీసుకెళ్లాడని, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందిత యువకుడ్ని అరెస్ట్ చేశారు. ఆ బాలికను కోర్టులో హాజరుపరచగా... అజయ్‌ తనపై అత్యాచారం చేశాడని న్యాయమూర్తి ఎదుట వెల్లడించింది.


అప్పటి నుంచి కేసు నడుస్తుండగా.. నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు. గత ఫిబ్రవరిలో కోర్టు విచారణ సందర్భంగా.. బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. తనను అలాచెప్పాలని తల్లి బలవంతం చేసిందని నిజం బయటపెట్టింది. తన అక్కతో రాఘవ్ సన్నిహితంగా ఉండటం ఆమెకు నచ్చలేదని, తాను మైనర్ కావడంతో కేసు బలంగా ఉంటుందని తప్పుడు ఫిర్యాదు చేయించిందని పేర్కొంది. దీంతో అదనపు సెషన్స్‌ న్యాయస్థానం అజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.


అంతేకాదు, తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై సెక్షన్‌ 340 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఏ తప్పూ చేయని ఓ వ్యక్తి 1,653 రోజులు జైలులో గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది. ఆ మహిళను కూడా అన్ని రోజులపాటు జైల్లో ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. రూ.5,88,822 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు.


‘ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై కఠినమైన చర్యలను తీసుకుంటాయి.. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేయాలని భావించే మహిళలు.. పురుషుల హక్కులపై ప్రభావం చూపుతారని దీని అర్థం’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘అజయ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని.. తప్పుడు ఆరోపణల కారణంగా అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.. అత్యాచారం వంటి నేరానికి జైలు శిక్షను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.. తమ భద్రత రూపొందించిన చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలు డబ్బును కాజేసే మార్గంగా ఉపయోగించకోకూడదని మేము న్యాయస్థానాన్ని కోరాం’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com