అనంతపురం కియా పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం తీవ్ర దాడులకు పాల్పడ్డారు. జూనియర్లు, సీనియర్లు అంటూ పరస్పరం నిందించుకుంటూ ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడి ఘటనను కంపెనీలోని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అనంతపురంలో గల కియా కంపెనీలోని ప్రధాన ప్లాంట్లైన హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుంటాయట. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతకాలం స్వల్ప వివాదాలే జరుగుతుండగా.. ఇవాళ మాత్రం భయానక రీతిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చినికి చినికి గాలివానలా మారి.. చివరికి ఐరన్ రాడ్లతో బాదుకునే వరకు వెళ్లింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులతో కియాలో పని చేస్తున్న మిగతా ఉద్యోగులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఉద్యోగులు. కంపెనీ నిర్వాహకులు ఈ ఘర్షణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.