ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్‌పై ఉగ్రవాదుల కన్ను.. పాక్‌ నుంచి ఉగ్రహెచ్చరికలు

international |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:20 PM

ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండగా.. ఇది ముగియగానే మెన్స్ టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి టీ20 వరల్డ్‌కప్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌లో జరిగే టీ20 మ్యాచ్‌లపై దాడి చేస్తామని పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రసంస్థ తాజాగా హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. వెస్టిండీస్‌లో జరిగే మ్యాచ్‌లలో విధ్వంసం సృష్టించేలా హింసాత్మక ప్రచారాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వెస్టిండీస్‌.. మ్యాచ్‌లకు ఎలాంటి ముప్పు లేదని హామీ ఇచ్చింది. ఈ హెచ్చరికలపై ట్రినిడాడ్ ప్రధాని, ఐసీసీ కూడా స్పందించాయి.


వెస్టిండీస్‌లో జరిగే టీ20 మ్యాచ్‌లకు ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతం నుంచి తాజాగా బెదిరింపులు రావడం సంచలంగా మారింది. టీ20 వరల్డ్ కప్ సహా పలు ఇతర స్పోర్ట్స్‌లపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ పిలునిచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇస్లామిక్ స్టేట్-ఐఎస్‌కు సంబంధించిన మీడియా వర్గాలు.. ఆ ప్రాంతంలో హింసను ప్రేరేపించే విధంగా, విధ్వంసం చేసేలా రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు అంతా యుద్ధ రంగంలోకి దిగాలని వారు పిలుపునిస్తున్నారని సమాచారం.


ఈ ఉగ్ర హెచ్చరికలపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. తమ దేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం జరగదని హామీ ఇచ్చింది. టోర్నీకి సెక్యూరిటీ పరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. ఉగ్రవాద హెచ్చరికలకు క్రికెట్‌ ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వరల్డ్ కప్ టోర్నీని సాఫీగా నిర్వహిస్తామని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు.


తాజాగా ఉగ్రహెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్-ఐసీసీ అలర్ట్ అయింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటున్నాట్లు వెల్లడించింది. ప్రతీ ఆటగాడి సెక్యూరిటీకి వెస్టిండీస్ క్రికెట్‌ బోర్డు భరోసా ఇచ్చనట్లు చెప్పింది. ఇక ప్రస్తుత కాలంలో ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం చాలా దురదృష్టకరమని ట్రినిడాడ్ ప్రధాని కీత్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అతిపెద్ద క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం తమకు దక్కిందని.. దాన్ని సక్సెస్ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉగ్రమూకలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసిటన్లు స్పష్టం చేశారు.


ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 20 టీమ్‌లు పోటీ పడనున్నాయి. ఈ జట్లను మొత్తం 4 గ్రూప్‌లుగా విడగొట్టి షెడ్యూల్ రూపొందించారు. జూన్ 1 వ తేదీన అమెరికా డల్లాస్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ప్రారంభం కానున్న పొట్టి క్రికెట్ మహా సంగ్రామం.. జూన్ 29 వ తేదీన బార్బడోస్ వేదికగా జరిగే ఫైనల్‌తో ముగియనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ జట్టు.. కెనడాతో తలపడనుంది. ఇందులో జూన్ 5 వ తేదీన ఐర్లాండ్‌తో, జూన్ 9 వ తేదీన పాకిస్థాన్‌తో, జూన్ 12వ తేదీన యూఎస్‌ఏతో, జూన్ 15 వ తేదీన కెనడాతో టీమిండియా తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com