కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన విద్యా రంగం ఇప్పుడిప్పుడే మళ్లీ దారిలో పడుతోంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాలలు సరిగ్గా నడిచింది లేదు. ఇప్పటికే రెండు అకాడమిక్ ఇయర్స్పై కరోనా ప్రభావం పడింది. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు, అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో ప్రభుత్వాలు పాఠశాలలను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలను ప్రారంభించాయి కూడా. అయితే కరోనా తర్వాత విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపిస్తారా.? లేదా.. అన్న సంశయం ఉండేది. కానీ ఈ ఆలోచనలోనూ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయమై పలు వ్యాఖ్యలు చేశారు.
స్కూళ్ల పునఃప్రారంభం విషయమై మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలలు పునఃప్రారంభమై ఇప్పటికే పది రోజులు పూర్తయ్యాయి. కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత కూడా హాజరు శాతం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. 75 నుంచి 85 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలో కోవిడ్ నిబంధనలను, భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక మాస్కుల వినియోగాన్ని కూడా తప్పనిసరి చేశామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన కొన్ని పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పిన మంత్రి.. కరోనా అధికంగా ఉన్న పాఠశాలలో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా స్కూళ్ల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.