ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తా.. ఆ విషయంలో పవన్ కంటే జగన్ బెటర్: మహాసేన రాజేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 09:46 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లోకి చేరికలు నడుస్తున్నాయి.. అటు నచ్చకపోతే ఇటు.. ఇటు నచ్చకపోతే ఇటు అన్నట్లు పార్టీలు మార్చేస్తున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్ ఎన్డీఏ కూటమికి ఊహించని షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఎన్నికల్లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అనూహ్యంగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.


'పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం.. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది.. వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్.. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు.. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం.. ఇప్పటికే చాలా సహించాం.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం.. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం.. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్లం.. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము'అంటూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు. మహాసేన రాజేష్ తీసుకున్న ఈ నిర్ణయం కూటమికి తలనొప్పిగా మారింది.


మహాసేన రాజేష్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి.. ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొంతకాలానికే జగన్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ మహాసేన మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అకౌంట్‌లు ఓపెన్ చేశారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ జనసేన పార్టీకి దగ్గరయ్యారు. దీంతో ఆ పార్టీలో చేరతారని భావించారు.. కానీ అనూహ్యంగా తానే సొంత పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు. ఇంతలో ఏమైందో ఏమో మళ్లీ వెనకడుగు వేసి తెలుగు దేశం పార్టీలో చేరారు.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు.


టీడీపీ అధినేత చంద్రబాబు రాజేష్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సీటిచ్చారు. కానీ రాజేష్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో పరిస్థితి మారిపోయింది.. రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు.. ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అయితే కొన్ని రోజులకు మహాసేన తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని రాజేష్ ప్రకటించారు.. మళ్లీ తెలుగు దేశం పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్నారు.. పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో టీడీపీ మహాసేన రాజేష్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది.


రాజేష్‌కు మొత్తం 37 నియోజకవర్గాల్లో ప్రచారం బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. అయితే అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ తరఫున ప్రచారం చేయడానికి రాజేష్ వెళ్లారు.. అయితే ఆయన వెళ్లేలోపే ప్రచారం ప్రారంభించడంతో అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు. ఆ తర్వాత ప్రచారానికి దూరంగా ఉన్నారు.. ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com