ఆఫీసుకు ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, టిప్టాప్గా తయారై ఉద్యోగులు వెళ్తారు. సోమవారం వస్తుందంటే.. ఆ వారంలో ధరించే దుస్తుల్ని సిద్ధం చేసి పెట్టుకుంటారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వారాంతాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఇలాగే, కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ కూడా తమ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో వినూత్న ఆలోచన చేసింది. సోమవారం ముడతలతో ఉన్న బట్టలు వేసుకోవాలని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ తన సిబ్బందిని కోరింది. ఇందులో భాగంగా వాహ్ మండేస్ ను ప్రారంభించింది. ‘’ (ముడతలు మంచివే). ప్రతీ సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించడం ప్రధాని ఉద్దేశం. దీని వెనక పర్యావరణహితం కూడా ఉందని చెబుతోంది.
దీనిపై సీఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.కళైసెల్వి మాట్లాడుతూ.. ఇంధన వినియోగంపై అవగాహనలో భాగంగా వాహ్ మండేస్ను చేపట్టినట్టు ఆమె తెలిపారు. ‘సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి పర్యావరణానికి తమ వంతు సహకరించాలని సీఎస్ఐఆర్ నిర్ణయించింది. ఒక జత దుస్తుల్ని ఇస్త్రీ చేసినప్పుడు గాల్లోకి 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది.. ముడతల దుస్తులు ధరించడం వల్ల దానిని నివారించే అవకాశం కలుగుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇంధన ఆదాపై మే 1 నుంచి 15 వరకు ‘స్వచ్ఛతా పక్వాడా’ కార్యక్రమాన్ని సీఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని కొన్ని నిబంధనలను రూపొందించింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య పైలట్ ప్రాతిపదికన వీటిని అమలుచేయాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలను 10 శాతానికి తగ్గించడం మొదటి లక్ష్యం. కాగా, ఎర్త్ డే వేడుకల్లో భాగంగా గత నెల ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్ను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. కర్బన ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పుల గురించి ఇది గ్రాఫ్ రూపంలో వివరణ ఇస్తుంది. మాతృభూమి, గ్రహాన్ని రక్షించడానికి సీఎస్ఐఆర్ సహకారం ఇది అని కళైసెల్వి అన్నారు.