ఓ విద్యార్థినిపై ఆమె చదువుతున్న కాలేజ్లో నాన్ టీచింగ్ సిబ్బందిగా ఉన్న వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ఈ ఘటన అసోంలోని ధేమాజీ జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తి ఆమె మాజీ ప్రియుడే అని ఆ కాలేజ్లోని విద్యార్థులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర అసోం ధేమాజీ జిల్లాలోని మోరిధార్ కాలేజ్లో నందిత సైకియా డిగ్రీ చదువుతోంది. నందితపై కాలేజ్లో నాన్ టీచింగ్ ఉద్యోగి అయిన రింటు శర్మ శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నందిత తీవ్రంగా గాయపడింది. నందిత పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నందిత బుధవారం సాయంత్రం మరణించింది. అయితే దాడి జరిగిన తర్వాత తీసిన ఒక వీడియోలో రింటు శర్మ చేతిలో కత్తితో కనిపించాడు. 'ఆమె కోసం అన్ని చేసినప్పటికీ నా జీవితాన్ని నాశనం చేసింది' అని అతడు అన్నాడు. ఈ ఘటన జరిగిన కాసేపటికే పోలీసులు నిందితుడు రింటు శర్మను అరెస్ట్ చేశారు. రింటు శర్మ, నందితల మధ్య కొంత కాలంగా ఎఫైర్ ఉందని ఆ కాలేజ్ విద్యార్థులు తెలిపారు. అయితే నందితకు తెలిసిన కొన్ని కారణాల వల్ల అతడి నుంచి విడిపోవాలని భావించిందని చెప్పారు. ఈ క్రమంలోనే రింటు ఆమెపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.