జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అకృత్యాలు రోజురోజుకూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు గురించి తాజాగా స్పందించిన ఆయన బాబాయ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు ఉన్న పెన్డ్రైవ్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారని ఆరోపించారు. దీని వెనక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు అభ్యంతరకర వీడియోలు ఉన్న 25 వేల పెన్డ్రైవ్లను పంచారని తీవ్ర విమర్శలు చేశారు. మొట్టమొదట ఏప్రిల్ 21 వ తేదీన బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్డ్రైవ్ను విడుదల చేశారని ఆరోపించారు. అదేరోజు రాత్రి ఒక వాట్సాప్ ఛానల్ను క్రియేట్ చేసి.. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఆ ఛానల్ను ఫాలో కావాలని ఆ వాట్సాప్ ఛానల్లో మెసేజ్ పెట్టారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 22 వ తేదీన జేడీఎస్ నేతలు రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినట్లు హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు.
అయితే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల గురించి మాట్లాడిన కుమారస్వామి.. తాను ఆ వీడియోలను ఎంత మాత్రం సమర్థించడం లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడాలని పేర్కొన్నారు. ఇక ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల పెన్డ్రైవ్లను పంచిన ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్న కుమారస్వామి.. ఆ కేసులు నమోదై 15 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ మొత్తం ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినపుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని.. కానీ ప్రస్తుతం మాత్రం అలా కనిపించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని తమ ఇంటికి పిలిపించుకుని.. ఈ కేసు గురించి మాట్లాడుతున్నారని కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఓడిపోతారని సీఎం సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ పెన్డ్రైవ్ల పంపిణీ వెనుక పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. పోలీసు అధికారుల సహాయంతోనే వాటిని పంపిణీ చేశారని చెప్పారు.