తీవ్ర నీటి ఎద్దడితో గొంతెండిపోతున్న బెంగళూరు నగరవాసులపై వరుణుడు కరుణించాడు. సోమవారం సాయంత్రం నుంచి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురు గాలులకు ఎక్కడకక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. వీటి తొలగించేందుకు రంగంలోకి దిగిన బృహత్ బెంగళూరు నగరపాలిక సిబ్బంది.. కార్యాచరణ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించారు.
‘భారీ వర్షాలకు 33 చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.. 16 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.. దీంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయి.. ట్రాఫిక్ స్తంభించిపోయింది.. వాహనాలను సజావుగా నిడిచేలా బీటీపీ 24 గంటలు పనిచేస్తోంది. తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాం.. ప్రజలు సహకరించాలి’ అధికారులు కోరారు. మరోవైపు, మే 10 వరకూ బెంగళూరుతో పాటు నగరం చుట్టుపక్కల, రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం కలిగించాయి. బెంగళూరులో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గత రెండు నెలలుగా నీటి కొరతతో కష్టాలను ఎదుర్కొంటున్న బెంగళూరు ప్రజలు.. సోమవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం లభించింది. ఐదు నెలల తర్వాత బెంగళూరులో భారీ వర్షం కురిసింది. చివరిసారిగా అక్టోబరులో అక్కడ భారీ వర్షం నమోదయ్యింది. బెంగళూరులో గత 8 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షపాతం లేక అక్కడి భూగర్భ జలాలు అడుగంటిపోగా.. ఎండలకు నీటి సమస్య మరింత పెరిగింది. ఏప్రిల్లో అక్కడ సగటున 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడూ చల్లగా ఉండే బెంగళూరులో ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులతో ఎండలు మండిపోతున్నాయి.