ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడం కలకలం రేపుతోంది. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. బొబ్బిలి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నాలుగో తరగతికి చెందిన 10 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారం రోజుల పాటు ఆ స్కూలుకు సెలవు ప్రకటించారు.
మరోవైపు కృష్ణాజిల్లా బావదేవరపల్లి స్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యార్ధుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాసంస్థలు తెరిచింది. ఇలాంటి సమయంలో కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్ధులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.