తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇప్పటివరకూ 11 మంది మరణించారంటూ, ఈఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ అందించిన వివరాలను సీఎం జగన్ కు సీఎంఓ అధికారులు వివరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఆపై పూర్తిస్థాయి నివేదిక తనకు అందించాలని సీఎం ఆదేశించాడు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరాడు. అవసరమైన సాంకేతిక సంస్థల సహాయం తీసుకుని రుయా లాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.