ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల నుంచి పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సీఎం జగన్ ఉన్నతాధికరులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని, గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను చైతన్యం చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందో సూచిస్తూ ప్రభుత్వంతో వ్యవసాయ కమిటీలు అనుసంధానమై పనిచేస్తాయని అన్నారు.
ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలని, జిల్లాల కలెక్టర్లు గోనె సంచులు సమీకరించుకోవాలని, వ్యయ నియంత్రణ సాకుతో ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు ధాన్యం పంపించవద్దని సీఎం జగన్ అన్నారు. జిల్లాను యూనిట్ గా తీసుకుని ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు రెండూ సమన్వయంతో కలిసి పని చేయాలని, రైతులు కోరిన విత్తనాలను పౌర సరఫరాల శాఖ అందించాలని, రైతులు బయట విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండేలా చూడాలన్నారు.