మోడీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను అందిస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు మూడు విడతలల్లో మొత్తం రూ. 6000 అందిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదలలో జాప్యం జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 2020 మార్చి -24 ఏప్రిల్ 20వ తేదీల మధ్యలోనే అత్యధిక రైతుల ఖాతాల్లో ఆ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులు రూ.2 వేలు చొప్పున జమ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల ముగిసిపోయినా ఇప్పటి వరకు వాటి జాడలేదు. ఏప్రిల్ 1- జూలై 31కి సంబంధించిన తొలి విడత రూ. 2 వేలు రైతుల ఖాతాలకు చేరకపోవడంపై వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఆరా తీయగా కరోనా కారణంగా పరిపాలనా పరమైన అనుమతుల జాప్యం జరిగిందని ఓ అధికారి తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక రిపోర్ట్ చేసింది. కాగా సమస్యలను పరిష్కరించి వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే మే నెలలో రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు అందించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా మే 2 తర్వాత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైనా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావొచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.