దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్ విజృంభణతో పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. ఇందులో 1,50,86,878 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
మరో 30,84,814 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 3,645 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత మంది బాధితులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా మరణాలు 2,04,8320కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది.మహారాష్ట్రలో నిన్న 63,309 కరోనా కేసులు నమోదవగా 985 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్లో 29,824, ఢిల్లీలో 25,986 మంది కరనాబారినపడ్డారు. కర్ణాటకలో 39,047, కేరళలో 35,103 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇలా దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు రికార్డయ్యాయి.దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 17,68,190 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 28 వరకు 28,44,71,979 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.