ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రధాని నరేంద్ర మోదీ కీలక మీటింగ్స్

national |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 09:06 AM

టైమ్ ఉదయం 11.30 దాటుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. దీన్ని కేబినెట్ మీటింగ్ అని అంటున్నారు కానీ... అధికారికంగా అలా చెప్పట్లేదు. ఇందులో ప్రధానంగా... కరోనా కేసుల పెరుగుదల, ఆక్సిజన్ నిల్వలు, సరఫరా, రెమ్‌డెసివిర్ మందు తయారీ, నిల్వ, కొరత, రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లో చర్చించే ప్రతీ అంశమూ కీలకమైనదే. ఎందుకంటే... ఇండియాలో రోజూ లక్ష కరోనా కేసులు వస్తేనే చాలా ప్రమాదకర విషయం... అలాంటిది ఇప్పుడు రోజూ 2న్నర లక్షలకు పైగా వచ్చేస్తున్నాయి. 12 రాష్ట్రాల్లో రోజూ 4వేలకు పైగా కేసులొస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 30వేల దాకా కేసులొస్తున్నాయి. ఈ కరోనా పరుగు ఎక్కడిదాకా అన్నది తేలట్లేదు. అందుకే ఏం చెయ్యాలో ఇవాళ్టి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. దేశమంతా లాక్‌డౌన్ విధించాలా అనే దిశగా మాత్రం ఏ చర్చా జరగదని తెలిసింది. అలాంటి పుకార్లు నమ్మవద్దని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.


 


ఈ కేబినెట్ మీటింగ్ అయిపోయాక... దీన్లో చర్చించిన అంశాలపై చిన్న పాటి రిపోర్ట్ తయారవుతుంది. మధ్యాహ్నం భోజనం చేశాక... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రిపోర్టు ఆధారంగా... దేశంలోని ప్రముఖ డాక్టర్లతో సాయంత్రం 4-30కి వర్చువల్ విధానంలో సమావేశం అవుతారు. కేసులు ఎందుకు పెరుగుతున్నాయి... వ్యాక్సిన్ ఫలితం ఎందుకు కనిపించట్లేదు... వంటి చాలా అంశాలపై విశ్లేషిస్తారు.


 


ఆ మీటింగ్ అయిపోగానే వెంటనే సాయంత్రం 6 గంటలకు మరో మీటింగ్ రెడీగా ఉంటుంది. అది దేశంలోని ఫార్మా కంపెనీలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మీటింగ్. ఇందులో మందుల తయారీ, రెమ్‌డెసివిర్ మందు కొరత, ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ల ఉత్పత్తి, విదేశీ వ్యాక్సిన్లు ఇలా ఎన్నో అంశాలపై చర్చించబోతున్నారు. ఏది ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బిజీ షెడ్యూల్ ఉంది. కొన్నిసార్లు జరగాల్సిన మీటింగ్స్ కూడా వాయిదా పడుతున్నాయి. ఈ ఫార్మా కంపెనీల సమావేశం నిన్నే జరగాల్సి ఉన్నా... ఇవాళ్టికి వాయిదా పడింది.


 


ఏప్రిల్ మొదట్లో కరోనా కేసులపై కేంద్రం ఒకింత నిర్లిప్తతతో ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. ఓవైపు ప్రజలను లాక్‌డౌన్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లనివ్వకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకుంటూ... మరోవైపు కరోనాను ఎలాగైనా కట్టడి చెయ్యాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటోంది. ఇవాళ్టి మీటింగ్స్ తర్వాత... రెమ్‌డెసివిర్ మందు ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com