చిన్న నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని తీసింది. ఆమె జీవితం అర్దాంతరంగా ముగిసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ప్యారానగర్ లో బాలాజీ,కిరణ్మయి దంపతులు నివసిస్తున్నారు. కిరణ్మయికి 34 సంవత్సరాలు. ఆమె ఓ లోకల్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కూడా పని చేశారు. శనివారం రాత్రి బాగా వర్షం రావడంతో వారు నివసిస్తున్న ఇంటి పై రేకులు కూలి పోయాయి. ఆ సమయంలో కరెంట్ కూడా పోయింది. వర్షం కాస్త ఆగడంతో కిరణ్మయి పైకి వెళ్లి కూలిన రేకులను పరిశీలించింది. చిందరవందరంగా పడి ఉన్న రేకులను సరి చేసేందుకు రేకులను పట్టుకుంది.సరిగ్గా అదే సమయంలో కరెంట్ వచ్చింది. రేకుల పై విద్యుత్ తీగలు పడి ఉండడంతో రేకులను పట్టుకున్న కిరణ్మయికి షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వంశీధర్ తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ షాక్ లు ఎక్కువ కొట్టే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. చిన్న నిర్లక్ష్యంతో మహిళ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.