గత కొన్ని రోజులుగా దేశమంతా చక్కర్లు కొడుతూ ముప్పు తిప్పలు పెడుతున్న రాకాసి మిడతల తిక్క కుదిరింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మిడతలతో పోరాడారు. టిఒఐ కథనం మేరకు.. డ్రోన్ల ద్వారా మిడతలపై రసాయనాలను స్ప్రే చేస్తూ వాటిని చంపేశారు. ఈ సందర్భంగా అగ్రికల్చరల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎన్.సింగ్ స్పందిస్తూ.. ‘‘తెల్లవారుజాము 4 గంటల నుంచి మిడతలపై రసాయనాలు చల్లే పని మొదలుపెట్టాం. మొత్తం 4 డ్రోన్లతో సుమారు 60 శాతం మిడతలను చంపేశాం. మిగిలిన గుంపు భరత్పూర్, మధురా వైపు ప్రయాణిస్తున్నాయి’’ అని తెలిపారు. మనుషులతో పని లేకుండా డ్రోన్లతోనే మిడతల పీడ వదిలిస్తున్న అధికారులకు ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.