ఫుల్లుగా మందేసినా అతనికి కరోనా భయం మాత్రం పోలేదు. దీంతో ఏకంగా ఆ మత్తులోనే చెట్టు ఎక్కి పడుకున్నాడు. వివరాల ప్రకారం.. బెంగళూరులోని గుల్బర్గా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ పరిసర ప్రాంతంలోని ఓ వ్యక్తి ఆదివారం పీకల దాకా మద్యం తాగాడు. ఆ తర్వాత ఏం చక్కా చెట్టెక్కి పడుకున్నాడు. చాలా సేపటి తర్వాత అతడిని గమనించిన స్థానికులు.. లేపే ప్రయత్నం చేశారు. ఉలుకు, పలుకు లేకపోవడంతో చనిపోయాడనుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ ఇద్దరిని చెట్టుపైకి ఎక్కించారు.పోలీసులు కూడా ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని భావించారు. కానీ చెట్టెక్కిన వారు అతడు బతికే ఉన్నాడని గుర్తించి అతి కష్టం మీద కిందకు దించారు. అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లను చూసి అందరూ షాకయ్యారు. పోలీసులు చెట్టు ఎందుకు ఎక్కావని ప్రశ్నించగా.. ఈ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు ఉన్నందున.. ఆ భయంతో వైరస్ నుంచి కాపాడుకోవడానికి చెట్టెక్కి పడుకున్నానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.