దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయ విమానాల రద్దును విమానయానశాఖ పొడిగించింది. ఈ ప్రకటనలతో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉండగా.. మృతుల సంఖ్య 15 వేలు దాటింది. రికవరీ శాతం ఎక్కువగా ఉండడం, మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ప్రకటించడంతో కోవిడ్- 19 మహమ్మారి వికృత రూపం దాలుస్తోంది. కేంద్రం ప్రకటించిన అన్ లాక్- 1 జూన్ 30 తో ముగుస్తోంది. అన్ లాక్-2 కంటే సంపూర్ణ లాక్ డౌన్ వైపే కేంద్రం మొగ్గుచూపే అవకాశముందని తెలుస్తోంది. మోదీ లాక్ డౌన్ విషయమై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.
మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తే కేసుల సంఖ్య తగ్గడంతో పాటు, వైరస్ ను నిరోధించే డ్రగ్స్ సైతం విరివిగా మార్కెట్లోకి వస్తాయన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసి ఆర్ధిక వ్యవస్థను మరింత పరిపుష్టం చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఊహాగానాల సంగతి ఎలావున్నా, జూన్ 30 తర్వాత లాక్ డౌన్ పై మోదీ సర్కార్ తీసుకోనున్న నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.