కరోనా వైరస్ సోకిందని ఓ ఫేమస్ స్వీట్ షాపు ఓనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ ఘటన జరిగింది. తిరునల్వేలిలోని ఇరుట్టు కడై (చీకటి కొట్టు) అనే ఫేమస్ స్వీట్ షాపు ఉంది. అందులో కేవలం హల్వా మాత్రమే తయారు చేస్తారు. ఆ షాపు ఓనర్ హరిసింగ్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. హరిసింగ్కు గత కొన్ని రోజుల నుంచి జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో నిన్న కరోనా టెస్టులు నిర్వహించారు. వాటికి సంబంధించిన టెస్టు ఫలితాలు ఈరోజే వచ్చాయి. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆ విషయం తెలిసిన తర్వాత హరిసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సుమారు వంద సంవత్సరాల క్రితం తిరునల్వేలిలో ఇరుట్టు కడై హల్వా షాపును ఏర్పాటు చేశారు. కేవలం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంటే కేవలం మూడంటే మూడు గంటలు మాత్రమే ఈ హల్వా షాపు ఓపెన్లో ఉంటుంది. ఆ సమయానికే జనం క్యూ కట్టి వచ్చి మరీ హల్వా కొనుక్కుని తింటారు. ఆ షాపులో చేసే హల్వాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా అభిమానులు, కస్టమర్లే. స్వీట్ షాపు అనగానే భారీగా లైట్లు, హంగామా లాంటివి లేకుండా కేవలం ఓ చెక్క ముక్కలతో చేసిన దుకాణం అని, తమకు ఎలాంటి ప్రమోషన్లు అవసరం లేదని ఆ కంపెనీ వెబ్ సైట్లో పేర్కొంది. తమను తాము తిరునల్వేలికి సంతకంగా అభివర్ణించుకుంది. ఇక్కడ తయారు చేసే హల్వా రుచి మరెక్కడా దొరకదని ఆ సంస్థ ధీమాగా చెబుతుంది.