దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. టెస్టులు చేసే కొద్ది పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 15 వేలు దాటింది. ఇవాళ ఉదయం వెల్లడైన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17,296 పాజిటివ్ కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా 4,90,401 కొవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి పెరిగింది.
కాగా గత వారం రోజుల నుంచి వరసగా 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం గమనార్హం. కేవలం ఈ నెల 1 నుంచి 26 వరకు దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,89,463 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 2,85,636 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 58.24గా ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు.