ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన కేసీఆర్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 04:53 PM

భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు. చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలు ఏర్పడ్డాయన్నారు. దీంతో దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోందన్నారు. చైనా వైఖరి ప్రపంచ వ్యాప్తంగా బాగా బద్నాం పాలైందన్నారు. భారత ఎదుగుదలను ఓర్వలేకే చైనా ఈ గోడవలు సృష్టిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయం తొందరపాటు చర్య అవుతుందన్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దని అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దన్నారు. రక్షణ వ్యవహారాల్లో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com