ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వియత్నాం వెళ్లేవారికి బిగ్ రిలీఫ్.... త్వరలోనే స్టార్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 09:57 PM

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నుంచి నూతన విమాన సర్వీసులు పెరుగుతున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండటం ఏపీకి కలిసి వస్తోంది. గత మూడు నెలల కాలంలోనే నాలుగు సర్వీసులు ప్రారంభం కావడం విశేషం. విజయవాడ, విశాఖపట్నం నుంచి విమాన సర్వీసులు పెరుగుతున్నాయి. త్వరలోనే మరికొన్ని సర్వీసులను ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వియత్నాం మధ్య విమాన సర్వీసులు నడపనున్నారు. ఈ విషయాన్ని వియత్నాం అంబాసిడర్ ఎంగ్యూయేన్ థాన్హయ్ వెల్లడించారు.


ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, వియత్నాం అంబాసిడర్ ఎంగ్యూయేన్ థాన్హయ్ విజయవాడలో జరిగిన ఓ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్- వియత్నాం దేశాల మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కాన్‌క్లేవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, టూరిజం గురించి కందుల దుర్గేష్.. వియత్నం అంబాసిడర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులను నడిపేలా చూస్తామని ఎంగ్యూయేన్ థాన్హయ్ తెలిపారు. వైట్‌జెట్‌ ద్వారా విమాన సర్వీసులు నడిపేందుకు చొరవ చూపుతామని వెల్లడించారు. దీంతో త్వరలోనే ఏపీ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు నడవనున్నాయి.


మరోవైపు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 27న అవార్డులు ప్రదానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వివిధ విభాగాల్లో పురస్కారాలు అందిస్తామన్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం 250 కోట్లు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్న కందుల దుర్గేష్.. అక్టోబర్ 15న టూరిజం డెవలప్‌మెంట్‌కు సంబంధించిన నివేదిక కేంద్రానికి అందిస్తామన్నారు. శ్రీశైలంలో టెంపుల్ టూరిజం, బాపట్లలో బీచ్ అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో వాటర్ స్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామన్న మంత్రి.. ప్రసాద పథకం ద్వారా అన్నవరం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆయన.. కేంద్రం సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com