దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూ, మనోవికాసానికి , ఆనందానికి , సద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ చీకటనే అంధకారం ఉండదు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపాన్ని వెలిగించడంతో మొదలు పెడతారు. అయితే ఈ ఆలయంలో ఉన్న దీపం గత 400 వందల సంవత్సరాల నుండి నిరంతరం వెలుగుతూనే ఉంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది. మానేరు నదీతీరం వద్ద ఆ గ్రామం ఉంది. అచంచెలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్థుల నిత్యపూజలకు నిదర్శనం. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నందాదీపం తరతరాలుగా వెలుగుతోంది. పూర్వీకులు వెలిగించిన ఆ దీపాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో కాపాడుతున్నారు. జ్యోతి వెలిగితేనే ఆవునూరు సిరిసంపదలతో తులతూగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం.నందాదీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారాలు లేకపోయినా దీపం నిత్యం వెలుగుతూనే ఉందని నాలుగు తరాలకు చెందిన గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో కొలువుదీరిన సీతారామచంద్రస్వామి భక్తుల కొంగుబంగారమై కోరినకోరికలు తీరుస్తున్నాడు. పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం మానేరు నదీతీరంలోని పచ్చని పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.