బీడీలకు డబ్బులివ్వలేదని కన్నబిడ్డని కర్కశంగా చంపేసిన కసాయి తండ్రి ఉదంతం వెలుగుచూసింది. భార్య చిల్లర డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అభం శుభం ఎరుగని ఆరునెలల పసికందును నేలకేసి కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. టిఒఐ కథనం మేరకు.. మండలంలోని అమానిగుడిపాడు గ్రామానికి చెందిన బాల ఏసు, విజయ భార్యాభర్తలు. ఇటీవల వారికి ఆడబిడ్డ పుట్టింది. ఖాళీగా ఉంటున్న బాలఏసు బీడీలకు డబ్బులు కావాలంటూ భార్యని అడిగాడు. ఆమె తన వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు. చిల్లర డబ్బులడిగితే లేవని చెప్పిందన్న కోపంతో కన్నబిడ్డని దారుణంగా హత్య చేశాడు. కనీస కనికరం లేకుండా ఆరునెలల చిన్నారిని అమానుషంగా చంపేశాడు. గొంతుపట్టుకుని నేలకేసి కొట్టడంతో పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే బాలఏసుకు మతిస్థిమితం లేదని.. ఏం చేస్తుంటాడో తనకే తెలియదని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా బీడీలకు డబ్బులివ్వలేదని కన్నబిడ్డని కిరాతకంగా హత్య చేయడం స్థానికులను కలచివేసింది.