2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియాతో 2 డే నైట్ టెస్టులు ఆడాలనే ఆలోచన ఆస్ట్రేలియాకు 'బ్యాక్ ఫైర్' అవుతుందేమోనని మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలమైన బౌలింగ్ ఎటాక్ను కలిగి ఉందని తెలిపాడు. "ఇక్కడ విషయం ఏంటంటే టీమిండియా ఆడిన తొలి డే నైట్ టెస్టులో చాలా సులభంగా గెలిచారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రదర్శన దానికి కొనసాగింపుగా సరైన దశలో ఇక్కడ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టు మ్యాచ్లనే వారు పరిశీలిస్తారనడంలో ఎటువంటి నాకు ఎలాంటి సందేహం లేదు. జవవరిలో టీమిండియాతో తలపడేటప్పుడు అదే జరుగుతుంది" అని చాపెల్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా టీమిండియాతో ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 2 డే నైట్ టెస్టులు ఆడటం "కొంచెం ఎక్కువ" అని సౌరవ్ గంగూలీ అన్న సంగతి తెలిసిందే. జనవరి 14 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ నేతృత్వంలోని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం బీసీసీఐ ప్రతినిధులతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులపై ప్రతిపాదన తీసుకురానున్నట్టు సమాచారం.