శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం వివాదాన్ని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. శనివారం శబరిమల అయ్యప్ప ఆలయం తెరచుకోనున్న నేపథ్యంలో.. ఇవాళే తుది తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఏదో ఒక క్లారిటీ వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. మరి శనివారం గుడి తెరచుకుంటే మహిళలు వెళ్తారా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శబరి మల తీర్పుపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో న్యాయ కోవిదులను సంప్రదిస్తామని వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నాకే ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు విజయన్. శబరిమలలోకి మహిళలను అనుమతించాలా? లేదా? అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా.. వాటిని అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించలేదని గుర్తు చేశారు విజయన్.
కాగా, శబరిమలలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సందేనని 2018లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. వాటిని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. ఐతే గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. గత తీర్పుపై స్టే ఇవ్వనందున శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని తృప్తి దేశాయ్ సహా పలువురు మహిళా హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.