టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెబితే అమాంతం విరుచుకుపడే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మరోసారి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేవినేని అవినాష్ ను గుడివాడలో పోటీ చేయించడం ద్వారా చంద్రబాబు తన అవసరాల కోసం అతన్ని రాజకీయ బలిపశువుగా మార్చారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అవినాష్ నానీ పై పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ వైసీపీలో చేరడంతో నాని స్పందించారు. టీడీపీ నేతలంతా పార్టీ అధినేత తీరుతో విసిగిపోయి ఉన్నారన్నారు. బాబు ఇసుక దీక్షపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తీరువల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని, త్వరలోనే టీడీపీకి విపక్ష హెూదా కూడా ఉండదని జోస్యం చెప్పారు.