ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు తమ మద్దతు తెలుపుతున్నట్టు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేపట్టిన నిరాహారదీక్షకు శిబిరానికి వెళ్లి తమ సంఘీ భావం తెలిపారు.ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ, పరిపాలనా దక్షత లేకుండా పరిపాలిస్తే ఏవిధంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోందంటూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎంతో పరిపాలనా దక్షత గలవారు కనుకనే ఆరోజున ఉచిత ఇసుకను ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుకకు తీసుకున్న దాని కంటే ఎక్కువగా ఈరోజున తీసుకుంటున్నారని, అలా వసూలు చేసిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం నాయకుడికి ఉందని, భారీ మెజార్టీతో వైసీపీని ప్రజలు గెలిపిస్తే ఈరోజున మీరు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ఏ ప్రజలు అయితే ఎన్నుకున్నారో వారిని రోడ్డున పడేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.