రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి(టీఏసీ) నిర్ణయించింది.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన టీఏసీ సమావేశంలో గిరిజన శాసనసభ్యులు, ఉన్నతాధికారులు సుధీర్ఘంగా చర్చించి గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ,ఎస్టీ కమిషన్ స్థానంలో ఎస్టీలకు ప్రత్యేకంగా కమీషన్ ఏర్పాటు చేయాలంటూ తీర్మానించారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 39 మండలాల పరిధిలో 554 గ్రామాలు కొత్తగా ఏజెన్సీ ఏరియాలోకి చేర్చడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని, వాటన్నింటినీ ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర గిరిజన సలహా మండలి(టీఏసీ) సమావేశంలో తీర్మానించారు. .అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ పోడుభూముల పట్టాలను పొందని గిరిజన రైతులకు రాబోయే ఉగాది పండుగకు లోపుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు.
పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, అరకు ఎమ్మెల్యే ఫల్గుణ తదితరులు పలు అంశాలపై మాట్లాడారు.