ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంతో పాటు భూములిచ్చిన తమ త్యాగం వృథా పోకుండా చూడాలని కోరుతూ ఇవాళ అమరావతి రైతులు నిపుణుల కమిటీని కోరబోతున్నారు.. 33 వేల ఎకరాల్లో 23 వేల ఎకరాలను విక్రయించడం ద్వారా వచ్చే కోట్లాది రూపాయల మొత్తాన్ని మిగతా పది వేల ఎకరాల అభివృద్ధికి వాడి రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు మాటల్ని తాము నమ్మాల్సి వచ్చిందనేది ఇప్పుడు రైతుల ఆవేదన. రాజధాని కడతామంటే 33 వేల ఎకరాల భూముల్ని ముందూ వెనుకా ఆలోచించకుండా ఎలా ఇచ్చేశారు ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అమరావతిలో రైతులకు వేస్తున్న ప్రశ్న ఇది.
33 వేల ఎకరాల్లో అత్యధిక భాగం అభివృద్ధికి కేటాయింపులు చేస్తామని వాటి అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంతో మిగతా పది వేల ఎకరాలను బాగు చేస్తామని అప్పట్లో చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ లోని మంత్రులు తమకు చెప్పారని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అయితే తాము చంద్రబాబును చూసి తమ భూములు ఇవ్వలేదని, ప్రభుత్వం అడిగింది కాబట్టి ఇచ్చామని, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రస్తుత వైసీపీ సర్కారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్ తో ఇవాళ నిపుణుల కమిటీని రైతులు కలవబోతున్నారు.. రాజధాని ప్రాంత అభివృద్ధిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టుకున్న గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో రైతులు తమ అభిప్రాయాలను కమిటీకి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
నిపుణుల కమిటీ చెబుతున్న దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మార్పుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కానీ, వద్దని కానీ నిపుణుల కమిటీకి ప్రభుత్వం సూచించలేదని తెలుస్తోంది. అభివృద్ధికి అన్ని విధాలా ఉపయుక్తంగా ఉండే ప్రాంతం రాజధానిగా పనికొస్తుంది కాబట్టి ప్రస్తుతం తాత్కాలిక రాజధానిగా ఉన్న అమరావతిలో పరిస్ధితులు ఆ మేరకు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని అంచనా వేస్తున్నట్లు నిపుణుల కమిటీ చెబుతోంది. వాస్తవానికి ప్రభుత్వం రాష్ట్రంలో రాజధానితో పాటు ఇతర పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గత నెలలో మాజీ ఐఏఎస్ జీఎ్ రావు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ గత వారం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. మూడు నెలల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
దీంతో జీఎన్ రావు కమిటీ ఏం చెబుతుందన్న అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ నివేదిక ఆధారంగానే రాజధాని అమరావతిపై వైసీపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేవని, వరదలు వస్తే ముంపునకు గురయ్యే పరిస్దితులు ఉన్నాయని మంత్రులు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో రాజదాని మార్పు తథ్యమని అత్యధిక శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే తాత్కాలిక కట్టడాలైనప్పటికీ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇక్కడే నిర్మించినందున రాజధాని మార్పు ఉండకపోవచ్చేనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీకి ముందు తమ అభిప్రాయం కుందబద్దలు కొట్టాలని రైతులు సిద్దమయ్యారు.