వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటేయడంతో... సర్కారుపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తోంది టీడీపీ. ఆ పార్టీ నుంచీ ఎన్నికల్లో గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే అయినా... పార్టీలో ఇదివరకటి ఉత్సాహం లేకపోయినా... అధినేత చంద్రబాబు మాత్రం పట్టువీడట్లేదు. ఎప్పటికప్పుడు తన రాజకీయ చతురతతో విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా అస్త్రాలు సంధించారు. తెనాలిలో అబ్దుల్ రజాక్ అనే మైనారిటీ వర్గానికి చెందిన యువకుడు, దివ్యాంగుడు.... వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడన్న చంద్రబాబు... ఉన్నపళంగా ఉద్యోగంలోంచి తీసేసే కొత్త సంప్రదాయం ఏంటని తాను అడుగుతున్నానని అన్నారు.
వైసీపీ కార్యకర్తల ఉపాధి కోసం, ఆల్రెడీ ఉన్నవాళ్లను ఉద్యోగాల్లోంచీ తీసేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు... గతంలో ఎప్పుడైనా ఉందా ఈ దుష్ట విధానం అని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆత్మహత్యాయత్నాలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించిన టీడీపీ అధినేత... కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం చేతకాని వైసీపీకి, ఉన్నవాళ్ళను తొలగించే హక్కు ఎక్కడిది అని ట్వీట్ చేశారు.